తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది హైకోర్టు.. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ మా దృష్టికి వస్తున్నాయని పేర్కొన్న హైకోర్టు… 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని.. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది హైకోర్టు… ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపించాలని సూచించింది.. రికార్డుల్లోని ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్లను కలెక్టర్లు ఆదేశించాలని స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం.. సబ్ రిజిస్ట్రార్లకు అనుమానం వస్తే ముందుగా కలెక్టర్లను సంప్రదించాలని పేర్కొంది.. ప్రభుత్వ భూముల సర్వే, వివరాల నమోదును కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది హైకోర్టు.. 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని.. హైకోర్టు ఉత్తర్వులను వారం రోజుల్లో కలెక్టర్లకు పంపించాలని ఏజీని ఆదేశించింది ధర్మాసనం.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.