తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు మరో భారీ కానుకను అందించబోతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను (Final Selection List) మరికాసేపట్లో బోర్డు అధికారికంగా విడుదల చేయనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్లుగా పనిచేయడానికి సుమారు 42,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని, పరీక్షలకు హాజరయ్యారు. గత కొంతకాలంగా ఫలితాల కోసం వేచి చూస్తున్న ఈ అభ్యర్థుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితా బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..!
రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఈ రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి. కేవలం రెండు రోజుల క్రితమే మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా 866 మంది డాక్టర్లకు నియామక పత్రాలు అందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లలో ప్రభుత్వం ఇప్పటికే 10,327 ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా విడుదలవుతున్న 2,322 నర్సింగ్ పోస్టులతో కలిపి, మొత్తం భర్తీ ప్రక్రియ 12,649 మైలురాయిని చేరుకుంది. ప్రభుత్వం ఇక్కడితోనే ఆగకుండా, ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం భర్తీ ప్రక్రియలో మరో 4,500 పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి, అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా బోర్డు వేగంగా కసరత్తు చేస్తోంది. వైద్య సేవలను సామాన్యులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ నియామక ప్రక్రియ పట్ల నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.