తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది.. వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి.. ఇప్పటికే పోలీసు విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇవాళ గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ). తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్ కావడం విశేషం.. మొత్తం 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి. ఇటీవలే గ్రూప్స్ పరీక్షల విధానాన్ని విడుదల చేసిన ప్రభుత్వం.. గ్రూప్ వన్లో ఇంటర్వ్యులను రద్దు చేసిన విషయం తెలిసిందే.. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే గ్రూప్ -1 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెయిన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు..
Read Also: Vaccination: 6 – 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్.. డీజీసీఐ అనుమతి..
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది టీఎస్పీఎస్సీ.. మే 2 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక, జులై / ఆగస్టులో ప్రిలిమినరీ, నవంబర్ / డిసెంబర్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.. కాగా, గ్రూప్ వన్ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మొదట టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇంతకు ముందే ఓటీఆర్ చేసుకున్నవారు అప్గ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డీఎస్పీ 91, సీటీవో 48, ఎంపీడీవోలు 121, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ 26, మున్సిపల్ కమిషనర్లు 41, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ 40 పోస్టులు భర్తీ చేయనున్నారు.