సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటనను సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. ఘటన జరిగిన తర్వాత పరారైన రాజు కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు.. నిందితుడికి మద్యం అలవాటు ఉండడంతో.. అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాల వద్ద నిఘా కూడా పెట్టారు.. ఇక, ఈ నేపథ్యంలో.. అన్ని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. నిందితుడు రాజు ఫొటోలతో స్థానికంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు ఉన్న పోలీస్ అధికారులు అందరూ అలర్ట్ గా ఉండాలని సూచించిన డీజీపీ.. చిన్న సమాచారాన్ని కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేయాలన్నారు. మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు డీజీపీ మహేందర్ రెడ్డి.