ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని.. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్.. రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు.. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
Read Also: KA Paul: టీఆర్ఎస్కి 30 సీట్లు కూడా రావు.. కేసీఆర్ అరెస్ట్ ఖాయం..
తమ జిల్లాలో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతోవెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు సీఎస్ సోమేష్ కుమార్.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని.. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని.. గత యాసంగిలో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు గానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొన్న ఆయన.. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.. గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలి.. దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇక, క్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధరగా నిర్ణయించడం జరిగింది.. వ్యవసాయవిస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలులో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏవిధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలని.. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల, ఏర్పాట్లను చేసుకోవాలన్నారు.. ఇక, ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలి.. జిల్లాలో వారి కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయి.. వీటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలి.. దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.