విద్యుత్ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ గురువారం విద్యుత్ సౌధ, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలను ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ధర్నా చేసేందుకు అనుమతుల లభించడంతో తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీధర్బాబు, జీవన్ రెడ్డి, మధు యాస్కీ, మల్లు రవి పాల్గొన్నారు. విద్యుత్ సౌధ ముందు రోడ్డుపై కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎండీతో మాట్లాడేందుకు విద్యుత్ సౌధలోకి 8 మందిని పోలీసులు అనుమతించారు. దీంతో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అధికారులకు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి చేశారు.
అటు కేంద్రం ఇష్టారీతిన పెంచిన పెట్రోల్,డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిస్కంల అప్పులను ప్రభుత్వం చెల్లించకపోవటం వల్లే ఇవాళ దివాళ తీశాయని ఆరోపించారు. వాస్తవాలను వారు ఒప్పుకునే పరిస్థితిలో లేరని, సీఎండీపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్నారు. సీఎండీతో మాట్లాడుతుంటే మఫ్టీలో ఉన్న పోలీసులు వీడియో తీస్తున్నారని, సీఎండీపై నిఘా ఉంచడంతో ఆయన చెప్పాలన్నది కూడా చెప్పలేకపోయారన్నారు. చివరికి ప్రభుత్వం పోలీసులతో బెదిరించి పాలన చేయాలనుకుంటోందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.