యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని పేర్కొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి పరిశీలించిన ఆయన.. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ఏ దశలో ఉన్నాయి..? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు.. ఇక, ఆ తర్వాత అధికారులతో సమావేశమైన కేసీఆర్.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకార్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు.
Read Also: 3 Capitals Boost to YSRCP: వైసీపీకి కలిసొచ్చిన మూడు రాజధానులు..! ఎన్నికల నినాదం అదే..
ప్లాంట్ ఆపరేషన్ కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుండి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పవర్ ప్లాంట్ కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది దానికి సంబంధించిన బొగ్గు, నీటి సరఫరా గురించి ఆరా తీశారు. ఈ నీటి సరఫరాకు కృష్ణా నీళ్లను సరఫరా చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణ పట్నం పోర్టు, అద్దంకి హైవే ను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్ధేశ్యంతో పవర్ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. పవర్ ప్లాంట్ లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్ షిప్ నిర్మాణం జరగాలని సీఎం ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలన్నారు.
ఇక, ఇదే ప్రాంతంలో భవిష్యత్ లో సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా చేపట్టనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారని దానికి అణుగునంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కేసీఆర్.. సిబ్బంది క్వార్టర్స్ ఇతర సదుపాయాల కోసం వంద ఎకరాలు ప్రత్యేకంగా సేకరించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు యాబై ఎకరాలు కేటాయించాలన్నారు. సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాప్ కి అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలన్నారు. టౌన్ షిప్ నిర్మాణంలో బెస్ట్ టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.
దామరచర్ల హైవే నుండి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు ఏడు కిలోమీటర్ల ఫోర్ లైన్ సీసీ రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితాసబర్వాల్ ను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో రెండు యూనిట్స్ 2023 డిసెంబర్ వరకు పూర్తవుతాయని మిగితా యూనిట్స్ జూన్ 2024 లోపు పూర్తవుతాయని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని ప్రభాకర్ రావు.. సీఎం కేసీఆర్కు తెలిపారు. ఇక, పవర్ ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ను అభినందించారు ముఖ్యమంత్రి కేసీఆర్.