తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వివిధ అంశాలు, సమస్యలపై వరుసగా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు లేఖలు కూడా రాస్తున్నారు.. తాజాగా, రైతులకు చెల్లించాల్సిన యాసంగి వడ్ల డబ్బుల గురించి లేఖ రాశారు రాష్ట్ర బీజేపీ చీఫ్.. వడ్లు కొనుగోలు రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని తాము చేసిన అనేక పోరాటాల తర్వాత రైతులనుండి వడ్లు కొనుగోలు ప్రారంభించిన విషయం మీకు, రాష్ట్ర రైతాంగానికి విధితమే. అయితే రాష్ట్రప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. అనేక జిల్లాల్లో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభం అవుతున్నా యాసంగి పంట డబ్బు చేతికి రాకపోవడంతో డబ్బుకోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థులు రైతులకు అప్పుల ఆశచూపి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు.. అమ్మిన పంట పైసలు రాలేదు, రైతుబంధు డబ్బు అందలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Sonia Gandhi: ఈడీకి సోనియా గాంధీ లేఖ.. మరింత సమయం ఇవ్వండి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,91,852 మంది రైతుల నుండి 11.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.2197.16 కోట్లు కాగా వీటిలో ఇంకా రూ.517.16 కోట్లు ప్రభుత్వం రైతులకు బకాయి పడిందని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.. రాష్ట్రప్రభుత్వ అహంకార పూరిత ప్రకటనలతో దాదాపు 14 లక్షల ఎకరాలలో యాసంగిలో రైతులు వరిపంట వేయలేదు. దీంతో వరివేయని రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉన్నా మీ ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం సాధారణ రైతులను బలిపశువులను చేస్తున్నారు.
రైతుసంక్షేమాన్ని కోరే ప్రభుత్వమని చెప్పుకొనే మీరు రైతాంగాన్ని నిలువునా దివాళ తీయిస్తున్నారు. మీ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదు. వానాకాలం సీజను ప్రారంభం అయినా మీ వ్యవసాయ శాఖామంత్రికాని, వ్యవసాయశాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు గాని కనీసం క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడం చూస్తే వ్యవసాయరంగం మరియు రైతులపై మీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం అవుతుందని మండిపడ్డారు.
యాసంగి పంట కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవడంతోపాటు, ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయాలలో వ్యవసాయశాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు బండి సంజయ్.. అన్ని జిల్లాల్లో రైతుసంఘాలతో, అన్నీ రాజకీయపార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం వెంటనే అందించాలని, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మీరు వెంటనే ఫామ్హౌజ్ నుంచి బయటకి వచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.