Srinivas Goud Clarity On SLR Gun Fire In Freedom Rally: ఫ్రీడమ్ ర్యాలీలో పోలీసుల తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూర్తి వివరణ ఇచ్చారు. తనకు ఆ రైఫిల్ స్వయంగా ఎస్పీ ఇచ్చారని.. బ్లాంక్ అమ్యూనిషన్తో పేల్చామని తెలిపారు. కేవలం శబ్దం కోసమే తుపాకీ కాల్చామని.. అందులో బుల్లెట్, పెట్లెట్ లేదని మహబూబ్నగర్ ఎస్పీ వివరణ ఇచ్చారని అన్నారు. ర్యాలీని, అందుకు వచ్చిన జనాన్ని చూపించకుండా.. కేవలం తుపాకీ కాల్చడాన్నే చూపించడం బాధాకరమన్నారు. రాజకీయంగా గిట్టలేకే కొంతమంది చీప్ ట్రిక్స్తో పబ్లిక్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎవడో పడని వాడు, గిట్టని వాడు చేయిస్తే.. వెరిఫై చేయకుండా జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని తీసుకెళ్లడం బాధాకరమన్నారు.
తమకున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే కొందరు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. అయినా.. ఎవరైనా ఎస్ఎల్ఆర్ తుపాకీని తీసుకుంటారా? అంటూ తిరిగి ప్రశ్నించారు. స్పోర్ట్స్ ఈవెంట్లో స్పోర్ట్స్ మినిస్టర్గా చేయమంటే చేశానని, ఇందులో ఏమీ లేదని చెప్పారు. ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్లో తానో మెంబర్నని, తనకు అన్ని రూల్స్ తెలుసని అన్నారు. తాను తెలంగాణ కోసం జైలుకు పోవడంతో పాటు ఆఫీసర్గా కేసులు కూడా ఎదుర్కొన్నానన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని, తాము స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్లినప్పుడు గాల్లో ఫైర్ చేస్తామని అన్నారు. ఫ్రీడమ్ రన్ చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించిందని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.