రాష్ట్రంలో శాంతి భద్రతలపై అఖిల పక్షంతో చర్చిద్దాం అని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని.. తెలంగాణను కాపాడుకోవడానికి ఎలాంటి శశబిషలు లేకుండా ప్రగతి భవన్ కు స్వయంగా నేనే వస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ ఆడ కూతుళ్ళను బయటకు పంపాలంటే బిక్కుబిక్కుమంటూ బతకడం మనం పోరాడి సాధించుకున్న తెలంగాణకు అవమానకరం కాదా..? మన తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మధ్య ఉన్న రాజకీయ పోరాటాలకు అతీతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం మీరు, మీ వ్యక్తిగత అహంకారాన్ని పక్కన పెట్టి అఖిలపక్షంతో, మహిళా, స్వచ్ఛంద, పౌర రక్షణ సంఘాలతో కలిసి చర్చించండి అని కేసీఆర్ కు సూచించారు.
భయాందోళనకు గురి అవుతున్న ప్రజలకు విశ్వాసం కల్పిద్దామని.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే సంఘవిద్రోహ శక్తులను, తెర వెనుక వాటికి అండగా ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కర్కశంగా తొక్కి వేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది” అని రేవంత్ రెడ్డి రాసిన లేఖలో స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో మొన్న ఒక మైనర్ బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీరు సిగ్గు పడాల్సిన విషయం కాదా..? అని ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసులు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది.? సాక్ష్యాలను, ఆధారాలను మాయం చేశారని వస్తున్న వాదనకు మీరు సమాధానం చెప్పరా.? ఒక ప్రభుత్వ వాహనంలో ఈ గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా..? మీరు నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు ఉన్నా, ఎందుకు తొలగించలేదు..? అని ప్రశ్నల వర్షం గుప్పించారు.
ఇంతకుముందే చిన్నారి చైత్రను చిదిమేయడం ఎంత అమానుషం.? వీటికి కారణం అవుతున్న డ్రగ్స్, పబ్స్, క్లబ్స్ మీద, వాటి నిర్వాహకుల మీద ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు సమీక్ష చేయలేదు..? ఇది భయాందోళనల్లో ఉన్న తెలంగాణ ప్రజల మనోబలాన్ని దెబ్బ తీస్తాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, తెలంగాణలో ఇంకా శాంతి భద్రతలు దిగజారకుండా, మరొకరు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.