Site icon NTV Telugu

CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తానని భ్రమపడుతున్నారని, కానీ తెలంగాణలో ఆ కుటుంబం శకం శాశ్వతంగా ముగిసిపోయిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతి, అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఎలాగైతే తిరస్కరించారో, 2029 ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్ – డి.శ్రీనివాస్ జోడీ కాంగ్రెస్‌ను వరుసగా ఎలా గెలిపించిందో, ఇప్పుడు తాను – పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసి రెండోసారి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేరుస్తామని ఆయన శపథం చేశారు.

Pakistan: పాకిస్థాన్‌కు చేజారిన రూ.12,500 కోట్ల డీల్.. సూడాన్ సంక్షోభంలో సౌదీ కీలక నిర్ణయం!

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, వారిచ్చిన తీర్పును గౌరవించకుండా కేసీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడటం ఆయన భ్రమలకు నిదర్శనమని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు ‘చిల్లర మాటలు’ అంటూ కొట్టిపారేసిన సీఎం, రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ఎప్పటికీ క్షమించరని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, ఇకపై తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ హవా మాత్రమే కొనసాగుతుందని రేవంత్ రెడ్డి కార్యకర్తల సాక్షిగా ప్రకటించారు. విపక్షాల విమర్శలకు తాము చేసే అభివృద్ధే సమాధానం చెబుతుందని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఈ సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కేసీఆర్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఆ అవకాశమే ఇవ్వకూడదనే పట్టుదలతో ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.

JEE Mains Session 2 Result 2026: జేఈఈ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Exit mobile version