CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా మీడియా చిట్చాట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి లోపాయికారీ ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు దమ్ముంటే, తాను నమ్మే దేవుడి మీద ఒట్టేసి వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించాలని సవాల్ విసిరారు. భవిష్యత్తులో ఒకవైపు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, కోదండరాం ఒక కూటమిగా ఉంటాయని, మరోవైపు బీఆర్ఎస్ , బిజెపి ఒకే జట్టుగా మారి ఎన్నికల బరిలోకి దిగుతాయని ఆయన జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన పరుష పదజాలాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటులో బిజెపి ఎంపీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య వెంటనే స్పందించి తిప్పికొట్టారని, ఆ విషయం బీఆర్ఎస్ నేతలకు వినిపించలేదా అని ప్రశ్నించారు. “వెదవలకు అందరూ వెదవల్లాగే కనిపిస్తారు” అంటూ కేసీఆర్ వ్యాఖ్యలకు అంతే దీటుగా సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందని, ఇప్పుడు ఆ పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రయోజనం తీరిపోయిన తర్వాత ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉండదని చెబుతూ, బీఆర్ఎస్ను ఒక “చనిపోయిన శవంతో” పోల్చారు. కాలం చెల్లిన పార్టీని పట్టుకుని కేసీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న జమిలి ఎన్నికల అంశంపై కూడా రేవంత్ స్పందించారు. జమిలి అనేది ఎవరికీ అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థమని, బిజెపి నేతలు తమలో తామే మాట్లాడుకుంటున్నారు తప్ప దానిపై ఎవరికీ స్పష్టత లేదని కొట్టిపారేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
