రైతు బంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని..ఈ నెల 14న 37వ సినిమా “రైతన్న” విడుదలవుతుంది.. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాలు రైతులకు వరాలు కావు, శాపాలు అని ఫైర్ అయ్యారు. ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారని… కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే ధైర్యంగా వ్యవసాయం చేసి ఆహారం అందించింది రైతాంగమన్నారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆర్.నారాయణమూర్తి.