చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ‘ ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీని సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పార్లమెంట్ లో బీసీల న్యాయపరమైన డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన బీసీల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యమాల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు అని అన్నారు. దేశంలో 70 కోట్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని.. చట్ట సభల్లో తమకు వాటా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 నుండి 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభ ఎంపీగా ఆయన ఇటీవల ఎన్నికయ్యారు.