Ponnam Prabhakar : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో, ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం తగదని ఆయన విమర్శించారు. “ఓటు కి 5 వేల రూపాయలు అడుక్కోండి అని చెప్పడం అక్షేపణీయం” అని వ్యాఖ్యానించిన ఆయన, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేటీఆర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… “హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చిన సంస్కృతి కేటీఆర్దే. ఇప్పుడు అదే పద్ధతిలో జూబ్లీహిల్స్లో ప్రయత్నిస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినవారు. వారు డబ్బు రాజకీయాలకు లోనుకావు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తారు” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
“మా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వంగా పనిచేస్తోంది. ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే పథకాలు అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, కొత్త ఉద్యోగాల కల్పన.. ఇవన్నీ మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయి,” అని తెలిపారు.
అంతేకాకుండా, హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేస్తోందని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయి కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. “బీజేపీ మూడు అంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టింది. మీరు బీజేపీకి వేసిన ఓటు బీఆర్ఎస్కే వెళ్తుంది, బీఆర్ఎస్కి వేసిన ఓటు బీజేపీకే వెళ్తుంది. అందుకే జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించండి” అని ఆయన పిలుపునిచ్చారు.
DVV Entertainments : ప్రశాంత్ వర్మ అడ్వాన్స్’ల పంచాయితీ.. మాకేం సంబంధం లేదన్న డీవీవీ