ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాగడం రోడ్డు ఎక్కడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది. దీని ఫలితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నగరంలో మితిమీరి పోతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 242 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 2020 లో 189 మంది మృతి చెందారు. సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 232 మంది మరణించారు. తాగి వాహనాలు నడిపిన వారిపై సైబరాబాద్లో 32, 828 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా సైబరాబాద్లో ఈ ఒక్క ఏడాదే 210 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 1,328 ప్రమాదాలు చోటు చేసుకోగా, తాగి వాహనాలు నడిపిన కారణంగా గతేడాదిలో తెలంగాణలో 343 మంది మరణించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ల ప్రమాదాలు ఎక్కువగా వీఐపీ జోన్లోనే జరుగుతుండటం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఓఆర్ఆర్లపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. నగర శివార్లతో పాటు సిటీ సెంటర్లోనూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాగిన మత్తులో స్పీడ్గా వెళ్తున్న మందుబాబులు. తాగిన వ్యక్తులు డ్రైవర్ లేకుండా పబ్బు నుంచి వెళ్లొద్దని పోలీస్ శాఖ ఆదేశాలు ఉన్నప్పటికీ మందుబాబులు బేఖాతరు చేస్తున్నారు. ఒకవేళ తాగి వెహికల్ నడిపి ప్రమాదానికి గురైతే పబ్లదే బాధ్యత అని గతంలో పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 12 పబ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు. గచ్చిబౌలి, మాదాపూర్లో ఉన్న పబ్లపైనే కేసులు నమోదు చేశారు. తాగి డ్రైవ్ చేసే వాళ్లకు పబ్లు డ్రైవర్ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.