ఉరుకుల పరుగుల భాగ్యనగరానికి రోజూ జిల్లాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. అందులో కొందరు ఇప్పటి వరకు హైదరాబాద్ గురించి తెలియని వారుకూడా ఉంటారు. అయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడకు వెళ్లాలో తెలియక ఎంతో మంది తికమక పడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు వేరే బస్సులు ఎక్కి అవస్థలు పడ్డ సందర్భాలు కూడా మనం చూసే ఉంటాం.
అయితే ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలకం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సికింద్రాబాద్ స్టేషన్కు ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు గందరగోళం లేకుండా స్టేషన్లోని 1, 10 ప్లాట్ ఫారంలపై ‘మే ఐ హెల్ప్ యూ’ పేరిట సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ.
ప్రయాణికులు ఎక్కడికెళ్లాలో కనుక్కొని, వారికి బస్సుల సమాచారమిస్తారు. ఏ బస్సులెక్కడ ఆగుతాయో వివరిస్తారు. స్టేషన్ నుంచి బస్ స్టేషన్ చేరేవరకు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సామాన్లతో వచ్చే ప్రయాణికులను బస్ స్టేషన్లో దింపేందుకు సమాచార కేంద్రాల వద్దే టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలనూ ఉంచుతోంది. ఇందుకు సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.