MLA Seethakka Fires On BJP and TRS Parties In Munugodu By Election Campaign: కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు పేదలకు పన్నులు పెంచి.. పెద్దలకు దోచిపెడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, ప్రజల కోసం అనేక పనులు చేసిందని అన్నారు. పేదల కడుపులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టం తెచ్చి.. వంద రోజుల పని కల్పించిందన్నారు. బడి తెచ్చినా, గుడి తెచ్చినా, రోడ్డు వేసినా, బస్ వచ్చినా.. అవి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినవేనన్నారు. ప్రశ్నించే గొంతుకలు, ఆత్మ గౌరవంతో బతికే వాళ్ళు కావాలని పిలుపునిచ్చిన సీతక్క.. ఇక్కడ కొంతమంది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలు మారారంటూ మండిపడ్డారు. అధికార పార్టీలకు దాసోహం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే పార్టీలో ఉంటే ఎంతో గౌరవం ఉంటుందని చెప్పారు.
పేదల కోసం సోనియా గాంధీ అనేక సంస్కరణలు తెచ్చారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆత్మగౌరవమని.. ఎంతోమంది తమ పనుల గురించి అసెంబ్లీలో ప్రశ్నించమని కోరుతుంటారని.. ఇలా ప్రజల కోసం పని చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని సీక్క తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ తరపున తాను ఒక్కదాన్నే ఆడ మనిషిని ఉన్నానని.. తనకు తోడుగా పాల్వాయి స్రవంతిని పంపించాలని కోరారు. మునుగోడు సమస్యలన్నీ తీర్చుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి కొందరు అమ్ముడుపోయారని.. కానీ తాను అలా అమ్ముడుపోనని, మీ కోసమే పని చేస్తామనని ప్రజలకు మాటిచ్చారు. ప్రజల కోసం పని చేసే వారిని, ప్రశ్నించే గొంతులకు అవకాశం ఇవ్వాలని కోరిన ఆమె.. అమ్ముడుపోయే వాళ్ళు ప్రజల కోసం ఏం పని చేస్తారని ప్రశ్నించారు. తమతో చెయ్యి కలపాలని.. పాల్వాయి స్రవంతిని గెలిపించాలని సీతక్క కోరారు.