Heavy security for MLA Rajasingh in jail: ఓ మతాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ హైదరాబాద్ ప్రదర్శన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హిందూ దేవతలను అవమానపరిచిన మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వ భారీ బందోబస్తు కల్పించి మునావర్ ఫరూఖీ షోను నిర్వహించింది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ మతాన్ని కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగస్ట్ 25న పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే రాజాసింగ్ భద్రత పెంచారు జైలు అధికారులు. రాజాసింగ్ ను మానస బ్యారక్ నుంచి శారద బ్యారక్ లోకి మార్చారు అధికారులు. రాజాసింగ్ కోసమ ములాఖత్ కోసం వస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. జైలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు. రాజాసింగ్ విషయంలో అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు.
Read Also: KTR: బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకి మోదీ సర్కార్ మొండి చేయి.
ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ కూడా సీరియస్ అయింది. బీజేపీ క్రమశిక్షణా కమిటీ రాజాసింగ్ ను ఆగస్టు 23న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ గడువు శుక్రవారంతో ముగిసింది. కాగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ జైలులో ఉండటంతో మరికొంత సమయం కావాలని రాజాసింగ్ భార్య బీజేపీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసింది.
రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా ఓల్డ్ సిటీలో తీవ్ర ఉద్రిక్తత ఎదురైంది. రాజాసింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ముస్లింలు. రాజాసింగ్ కు వ్యతిరేకంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పీడీ యాక్ట్ కింద రాజాసింగ్ ను అరెస్ట్ చేయడంతో ఆందోళనలు సద్దుమణిగాయి.