తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు వస్తున్నాయన్న విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తుందని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రొయ్యల పంపిణీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నల్గొండ జిల్లా కొండ భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్య పిల్లల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేస్తుందని అలాంటి పథకంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోబోమని ఆయన తెలిపారు. లబ్ధి దారులకు నాణ్యమైన చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.