తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఇటీవల తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా నిరూపించాలని.. బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్కి కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన ట్విట్టర్లో మంత్రి కేటీఆర్పైన బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, బండి సంజయ్ చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని అని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఈ రోజు కేటీఆర్ న్యాయవాది నోటీసులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారపూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్న న్యాయవాది.. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్కి ఆపాదించే దురుద్దేశపూర్వకమైన ప్రయత్నం చేశారన్నారు.
మంత్రి కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది నోటీసులో తెలిపారు.