తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఒకప్పుడు ఆదివాసీలు, గ్రామీణులు మాత్రమే ఈ జాతరలో పాల్గొనే వారు. ఈ జాతరకు రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎడ్ల బండ్లలో తరలి వెళ్లేవారు. కాల క్రమేణా జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్ల బండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది. 2012లో మొదటి సారిగా హెలికాప్టర్ ద్వారా రాకపోకలను ప్రవేశ పెట్టారు. 2014 నుండి వరంగల్ మామునూరు, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాల నుండి పర్యాటకులను తీసుక రావడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇలా మేడారం జాతర ఎడ్లబండి నుంచి హెలికాప్టర్ల ద్వారా వచ్చే వారి సంఖ్య అధికమైంది.
1990 ఏడాది వరకు నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్దగా ఈ జాతరకు వచ్చే వారు కాదు. దీనికి కారణం.. ఇరుకైన రోడ్లు, గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్, అంతంతగానే ఉండే పారిశుధ్య కార్యక్రమాలు తదితర కారణాలను చెప్పుకోవచ్చు. 1994 జాతర వరకూ భారీ సంఖ్యలో గ్రామీణులు, గిరిజనులు ఎడ్ల బండ్లలోనే వచ్చేవారు. జాతర ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందుగానే ఎడ్ల బండ్లలో మేడారం వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకొని సారలమ్మ, సమ్మక్కలు గద్దెలపై ప్రతిష్టాపన అయినా అనంతరం మూడోరోజు పూర్తి స్థాయి దర్శనం చేసుకున్న అనంతరమే తిరిగి వెళ్లేవారు.
1994లో జరిగిన మేడారం జాతరకు 25వేలకు పైగా ఎడ్ల బండ్లు వచ్చాయని అంచనా వేశారు. అయితే 1996 నుండి జంపన్న వాగుపై భక్తుల స్నానాలకు అనువుగా స్నానఘట్టాలు నిర్మించడం, క్రమక్రమేణా మొత్తం జంపన్న వాగు పొడవునా నిర్మించడంతో ఎడ్ల బండ్ల సంఖ్య 90 శాతం తగ్గింది. ఎడ్ల బండ్ల ద్వారా జంపన్న వాగులో నుండి మేడారం చేరుకోవాలనే స్థానిక గిరిజనుల విశ్వాసం. అయితే స్నానఘట్టాలు నిర్మించడంతో జంపన్న వాగు దాటడానికి అనువుగా లేకపోవడం, కాలక్రమేణా వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఎడ్ల బండ్లు జాతరకు వస్తున్నాయి. కాగా స్థానిక గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై 2002లో బ్రిడ్జిని నిర్మించారు. దీంతో పాటు వాగు పొడుగునా స్నాన ఘట్టాలను దాదాపుగా ఊరట్టం క్రాస్ రోడ్డు వరకు నిర్మించారు. ఈ మేరకు ఎడ్ల బండ్ల ద్వారా మేడారం వచ్చే ఆదివాసీ గిరిజనులు, గ్రామీణులు ఎడ్ల బండ్ల పై రావడం తగ్గించారు. ఇలా మేడారం జాతర ప్రస్థానం ఎడ్లబండి నుండి హెలికాప్టర్ వరకు మారింది.