సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగుల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న ఒక కేటుగాళ్ల ముఠా మాదాపూర్ కేంద్రంగా భారీ మోసానికి తెరలేపింది. ‘Camel Q సాఫ్ట్వేర్ సొల్యూషన్స్’ అనే సంస్థ పేరుతో రంగంలోకి దిగిన ఈ ముఠా, సుమారు 452 మంది అభ్యర్థుల నుంచి దాదాపు రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. మాదాపూర్ పోలీసులు పక్కా నిఘా పెట్టి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ పది మంది సభ్యుల ముఠా, నిరుద్యోగులకు గాలం వేసింది. శిక్షణ , ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని నమ్మించి, ఒక్కొక్క అభ్యర్థి నుంచి వారి అవసరాన్ని బట్టి రూ. 80 వేల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు. అభ్యర్థులకు నమ్మకం కలిగించడం కోసం ప్రారంభంలో కొందరికి జీతాలు కూడా చెల్లించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా బోర్డు తిప్పేసి పరారయ్యేవారు.
US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..
ఒక సంస్థపై నిఘా పెరుగుతోందని గమనించిన ఈ ముఠా, ఇటీవల ‘MU సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్’ అనే మరో కొత్త పేరుతో సంస్థను ప్రారంభించి మళ్లీ మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించింది. అయితే, బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు ఎరుకల మహేష్ (32) తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!
ఈ ముఠాపై గతంలోనే మాదాపూర్ , KPHB పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఒక కారు, స్కూటీ, మొబైల్ ఫోన్లు, కంపెనీ స్టాంపులు , బ్యాంక్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిని రిమాండ్కు తరలించారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కంపెనీల పూర్వాపరాలను పరిశీలించకుండా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు.