తెలంగాణ గులాబీ మయం అవుతోంది.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఊరు వాడ, పల్లె పట్నం అనే తేడా లేకుండా ముస్తాబు అవుతోంది.. ఇక, టీఆర్ఎస్ ఫౌండేషన్ డేను పురస్కరించుకుని ప్లీనరీ నిర్వహిస్తున్నారు.. ప్లీనరీలో రేపు ఉదయం 11 గంటలకు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్ కీలక ప్రసంగాన్ని చేయబోతున్నారు.. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కీలక సూచనలు చేశారు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని.. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిసి గ్రామంలోని పార్టీ శ్రేణులతో అందరినీ కలుపుకొని ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఉదయం 9 గంటలకు తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి.. దీంతోపాటు పట్టణాల్లోని బస్తీలు వార్డ్ కమిటీల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేయాలి.. ఈ జెండా పండుగకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు అన్నింటిని ఈరోజు సాయంత్రంలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం పార్టీ ప్రతినిధుల కార్యక్రమం అనే విషయాన్ని మనం నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు కేటీఆర్.. కేవలం పార్టీ పంపించిన పాస్ ఉన్న వారికి మాత్రమే ఆహ్వానం ఉన్నదన్న విషయాన్ని అందరూ గమనించాలన్న ఆయన.. ఇప్పటి నుంచే పార్టీ నిర్దేశించిన ప్రతినిధులకు పాసులు అందినవో, లేవో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని, ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పార్టీని సంప్రదించాలని సూచించారు. దీంతోపాటు సరైన సమయానికి రేపు 9 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకునేందుకు అవసరమైన రవాణా, వాహన సదుపాయాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను ఒకసారి పర్యవేక్షించాలని.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమావేశానికి వస్తున్న ప్రతినిధులకు సూచనలు చేశారు. ఖచ్చితంగా హైటెక్స్ ప్రాంగణానికి 9 గంటల లోపల చేరుకొని, తమ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్న కేటీఆర్.. ప్రతి ఒక్కరు గులాబీ దుస్తులను ధరించి రావాలి.. 10 గంటల లోపల సమావేశమందిరంలో ఆసీనులు కావాలి.. పార్టీ సమావేశం ప్రారంభమైన 10 గంటల నుంచి కార్యక్రమం ముగిసేంత వరకు సభా కార్యక్రమాలకు క్రమశిక్షణతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.. సమావేశంలో పార్టీ తరఫున ప్రతిపాదించే తీర్మానాలకు సంబంధించిన ప్రతులను సభకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చే బ్యాగ్లో ఉంచడం జరుగుతుంది.. ఈ తీర్మానాలకు సంబంధించిన అంశాలపై జరిగే సభా కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనవి అన్నారు కేటీఆర్.. ప్రస్తుతం రాజకీయంగా ప్రతిపక్షాలు లేవనేత్తే వివిధ రకాల ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వివిధ అంశాలపై దిశానిర్దేశం జరుగుతుందన్నారు. ప్రతినిధులు తిరిగి వెళ్ళిన తర్వాత తీర్మానాలకు సంబంధించిన చర్చను తమ కార్య క్షేత్రాలలో కొనసాగించాలని కీలక సూచలను చేశారు మంత్రి కేటీఆర్.