KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

Ktr

Ktr

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ తరఫున ఛార్జ్‌షీట్ విడుదల చేసిన ఆయన.. ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి.. ప్రజలకు వెయ్యి రోజులుగా నరకం చూపించారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను ‘ప్రజా పీడన’గా అభివర్ణించారు. ‘దరిద్రం దండయాత్రకు వెయ్యి రోజులు’, ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. మాజీ సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది ‘సర్వ భ్రష్ట పాలన’ అని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న నిరసన ప్రభుత్వ పాలన తీరుకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కమీషన్లు, పర్సంటేజీలతో కూడిన అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఢిల్లీ ముందు మోకరిల్లిన ‘సిల్లీ పాలన’గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. నీటి విషయంలోనూ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపిస్తూ.. ‘జలగల పాలన’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల వ్యవధిలో సుమారు రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకునే సమయానికి కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో అసమర్థత ‘ప్రో మ్యాక్స్’, అవినీతి ‘అల్ట్రా మ్యాక్స్’, అరాచకం ‘హై మ్యాక్స్’ స్థాయికి చేరిందంటూ సెటైర్లు వేశారు. నీళ్ల కోసం ప్రశ్నిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్.. రాష్ట్రంలో రైతుల పరిస్థితిపైనా ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రోజుల్లో వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశంలోనే తొలిసారిగా రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చామని చెప్పిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

‘రైతుబంధు బంద్ అయ్యి.. రాహుల్ బంధు మొదలైంది’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. రైతుల డబ్బులను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన యువతకు ఈ ప్రభుత్వంలో ఏం మిగిలిందని కేటీఆర్ ప్రశ్నించారు. యువతతో రాహుల్ గాంధీ ఫొటోలు దిగుతున్నారని, అయితే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వాలని యువత అడుగుతుంటే.. ప్రభుత్వం మాత్రం ‘జేబులు నింపుకోవడంలో బిజీగా ఉందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన జీవో నంబర్ 97పైనా అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు. అలాగే గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఓ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధానంగా అప్పులు, అవినీతి, రైతులు, నిరుద్యోగం, నీటి సమస్యలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.