తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఘట్కేసర్-రాయిగిరి (యాదాద్రి) విస్తరణకు రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని… పలుమార్లు కేంద్ర మంత్రులను, రైల్వే అధికారులను కలిసి విన్నవించినందుకు ఆమోదం రావడం సంతోషంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదగిరిగుట్టకు రాష్ట్ర రాజధాని నుంచి రవాణా సౌకర్యం చాలా సులభం అవుతుందని… అలాగే భక్తుల తాకిడి సైతం పెరుగుతుందని తెలిపారు. ఇటు భక్తులకు సౌకర్యం, అటు యాదాద్రి అభివృద్ది కావాలంటే ఈ ప్రాజెక్టు చాలా అవశ్యకమని… అయితే ఈ ప్రాజెక్టు మొదలు కావాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ భరించాల్సిన వ్యయాన్ని వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించేందుకు రైల్వే శాఖకు సహకరించాలని లేఖలో కోరారు. ఈ ప్రాజెక్టు సాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ 1:2 నిష్పత్తిలో వ్యయం భరించాల్సి ఉంటుందని… యాదాద్రి అభివృద్దికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టు మొదలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ. 75 కోట్లను రైల్వే శాఖకు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.