Komatireddy Venkat Reddy Gives Green Signal To Participate In Munugodu Election Campaign: కొంతకాలం నుంచి ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి ఎపిసోడ్పై నెలకొన్న సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. తాను కాంగ్రెస్ తరఫున మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తొలుత తనని అవమానించారన్న కోపంతో ఆయన ఈ ఎన్నికల ప్రచారంతో తనకు సంబంధం లేదని బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే! ప్రియాంకా గాంధీతో చర్చలు ఫలించడం, గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీలో తనకు తగిన గౌరవం దక్కడంతో.. ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటానని వెల్లడించారు. మునుగోడులో పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న విషయంపై.. కోమటిరెడ్డి తన అభిప్రాయాన్ని భట్టి విక్రమార్కకు తెలియజేశారు.
అయితే.. ఎన్నికల ప్రచారం విషయంలో మాత్రం కోమటిరెడ్డి ఒక చిన్న మెలిక పెట్టారు. కేవలం అవసరం అయినప్పుడు మాత్రమే ప్రచారానికి హాజరవుతానని ఫిట్టింగ్ పెట్టారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియజేయాలని భట్టి విక్రమార్కను తాను కోరానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని అన్నారు. ఈ భేటీలో అభ్యర్ధి ఎంపికపై చర్చ చేశామన్న ఆయన.. సోనియా గాంధీ, ప్రియాంక నిర్ణయం మేరకు అభ్యర్ధిని ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారని.. అయితే తుది నిర్ణయం మాత్రం ఏఐసీసీదే అని కోమటిరెడ్డి వెల్లడించారు.