Khammam: పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్లు వాడేస్తున్నారు.. ఛార్జింగ్ అయిపోతే.. ఇంట్లో ఉన్న పిల్లలకు ఫోన్ ఇచ్చి.. ఛార్జింగ్ పెట్టు అని పురమాయిస్తూ ఉంటారు.. అలాంటి వారు కాస్త ఆలోచన చేయాలి.. ఎందుకంటే.. సెల్ఫోన్కు ఛార్జింగ్ పెడుతూ.. బాలిక మృత్యువాతపడింది.. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి 8 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
Read Also: Deputy CM Pawan Kalyan: ఏనుగుల నుంచి రక్షణకు చర్యలు.. ‘కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటకతో చర్చలు..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ -సుధారాణి దంపతులకు అంజలి కార్తీక(8) అనే కూతురు ఉంది.. ఆ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, అప్పుడే టాయ్లెట్కి వెళ్లి వచ్చిన ఆ బాలిక.. తన తండ్రి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. చిన్నారి చేతులు తడిగా ఉండటంతో కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక స్థానిక ప్రభుత్వం పాఠశాలలో 4 వ తరగతి చదువుతుంది. 8 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన చిన్నారి మృతి చెండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు అయినా.. పెద్దవాళ్లు అయినా.. చార్జింగ్ పెట్టేటప్పుడు.. చేతులు తడిగా లేకుండా చూసుకోవడం మంచిది.. అసలే వర్షాకాలం కాబట్టి.. మరింత జాగ్రత్తగా ఉంటే మేలు.