తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి ప్రజల అస్తిత్వాన్ని అవహేళన చేసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ స్వంతంగా ఏమీ మాట్లాడటం లేదని, ప్రధాని నరేంద్ర మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్ను ఇక్కడ చదువుతున్నారని, ఆయనను చూస్తుంటే మోడీ ఏజెంట్లా అనిపిస్తోందని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సినిమాల్లో చెప్పే డైలాగులను రాజకీయాల్లో మాట్లాడటం పవన్ కళ్యాణ్కు అలవాటుగా మారిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. తనను ఎవరో అడ్డుకున్నారని గాల్లో మాటలు చెప్పడం సరికాదని, అసలు ఆయనను ఎవరు, ఎక్కడ అడ్డుకున్నారో స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. పవన్ కళ్యాణ్ అయినా, ఆయన కుటుంబమైనా తెలంగాణ ప్రజల ఆదరణ, భిక్ష వల్లే ఈ రోజు సినిమా రంగంలో ఇంతలా బాగుపడ్డారనే నిజాన్ని మరిచిపోకూడదని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ప్రస్తుతం తెలంగాణ ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్తో ఈ విధమైన రాజకీయ డ్రామాలు ఆడిస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కు ఎన్ని ఓట్లు వచ్చాయో, ఇక్కడి ప్రజలు ఆయనను ఎంతవరకు ఆదరించారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులని, పవన్ కళ్యాణ్ చెప్పే కట్టుకథలను గానీ, ఆయన మాటలను గానీ నమ్మే పరిస్థితిలో ఇక్కడి సమాజం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడాలని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
