ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్డేట్ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు కల్పనను ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్టమక్ వాష్ చేయించినట్లు చెప్పారు. అనంతరం ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. అధిక ఒత్తిడికి గురైతే లంగ్స్లోకి నీరు చేరుతుందని.. అందుకే వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చినట్లు చెప్పారు. వెంటిలేటర్ రెండు గంటలే ఉంచామని.. అనంతరం తొలగించినట్లు తెలిపారు. నిద్ర టాబ్లెట్ల ప్రభావం అయితే ప్రస్తుతం శరీరంపై లేదని.. ప్రస్తుతం ఆరోగ్యం కుదిటగానే ఉందని చెప్పారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని.. ఆక్సిజన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ మోతాడులో స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్లే అనారోగ్యం పాలైనట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే కేరళలో ఉన్న పెద్ద కుమార్తెతో ఫోన్లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసులు గుర్తించారు. దీంతో పెద్ద కుమార్తెను హుటాహుటినా హైదరాబాద్కు రప్పించారు. ప్రస్తుతం కుమార్తెను కల్పన దగ్గరకు తీసుకెళ్లారు.
అసలేం జరిగిందంటే..
ప్రస్తుతం కల్పన హైదరాబాద్లో ఉంటుంది. ఆమె పెద్ద కుమార్తె.. కేరళలో ఉంటుంది. అయితే కల్పన.. ఫోన్ చేసి హైదరాబాద్కు రావాలని కోరింది. అందుకు పెద్ద కుమార్తె.. హైదరాబాద్ వచ్చేందుకు నిరాకరించింది. తాను కేరళలోనే ఉంటానని చెప్పడంతో ఇద్దరి మధ్య ఫోన్లో వాగ్యుద్ధం నడిచినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోజు వేసుకునే టాబ్లెట్స్ కంటే.. అధికంగా వేసుకుందని పోలీసులు తెలిపారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేశారని.. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. అపార్ట్మెంట్ విల్లా సెక్రటరీకి ప్రసాద్ ఫోన్ చేసినట్లు తెలిపారు. అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం కుదిటపడిందని.. ఈరోజు ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: AP Assembly 2025: వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన!