IMD Weathter: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప పొలాలకు, బయట ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి.
Read also: Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..
దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి గాలుల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇదిలావుంటే.. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలోనూ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నుంచి గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..