Site icon NTV Telugu

CMRF: చిన్నారి వేద‌వల్లి కుటుంబానికి సీఎం ఆర్థిక చేయూత‌..

Cmrf

Cmrf

CMRF: అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుప‌త్రికి తీసుకెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని ప‌రీక్షల్లో తేలడంలో.. తల్లిదండ్రుల జీవితాలు పిడుగుపడినట్టు అయ్యింది.. పాప‌ను ర‌క్షించుకునేందుకు త‌ల్లిదండ్రులు రూ.ల‌క్షలు వెచ్చించారు. విష‌యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావ‌డంతో పాప చికిత్సకు రూ. 8 ల‌క్షలు మంజూరు చేశారు. అయితే, వ్యాధి ముద‌ర‌డంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్సకు గ‌తంలో చేసిన వ్యయానికి సంబంధించి మ‌రో రూ.7 ల‌క్షల‌ను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుద‌ల చేయాల‌ని సీఎం శ్రీ‌రేవంత్ రెడ్డి ఆదేశించ‌డంతో అధికారులు ఆ మొత్తాన్ని విడుదల చేశారు…

Read Also: Shehbaz Sharif: సియాల్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన పాక్ ప్రధాని.. కారణమిదేనా?

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ ఎల్బీ న‌గ‌ర్‌కు చెందిన ర‌ఘు, మంజుల దంప‌తులు నివాసం ఉంటున్నారు. ర‌ఘు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ర‌ఘు దంప‌తుల‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వేద‌వ‌ల్లికి (5) 2022లో తీవ్ర జ్వరం రావ‌డంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు బ్లడ్ క్యాన్సర్ (అనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లార్జ్ లింఫోమా) అని తేల్చారు. పాప‌ను ర‌క్షించుకునేందుకు రెండేళ్ల పాటు త‌ల్లిదండ్రులు ప‌లు ఆసుప‌త్రుల చుట్టూ తిప్పారు. చికిత్స వ్యయం నానాటికీ భార‌ంగా మారడంతో 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆసుప‌త్రిలో వేద‌వ‌ల్లి చికిత్సకు అవ‌స‌ర‌మైన రూ.8 ల‌క్షల‌ను మంజూరు చేశారు. చికిత్స అందించిన‌ప్పటికీ అప్పటికే వ్యాధి తీవ్రత పెర‌గ‌డంతో గ‌తేడాది చివ‌ర‌లో వేద‌వ‌ల్లి మ‌ర‌ణించింది. ఆమె చికిత్సకు గ‌తంలో ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేసింది. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 ల‌క్షలు మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేర‌కు మంజూరు చేసిన రూ.7 ల‌క్షల చెక్కును సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు వేద‌వ‌ల్లి తండ్రి ర‌ఘుకు గురువారం రోజు స‌చివాల‌యంలో అంద‌జేశారు.

Exit mobile version