హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి శోభాయాత్రలు సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనుండటంతో, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 30 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉంచగా, ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. GHMC కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేసింది. నిమజ్జనానికి 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, అత్యవసర పరిస్థితుల కోసం 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు.
పరిశుభ్రత కోసం GHMC 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని కేటాయించింది. రాత్రి వేళల్లో సౌకర్యం కోసం 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అధికారులు అంచనా ప్రకారం, సెప్టెంబర్ 6న సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలలోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.