Hyderabad Biryani Tax Scam : భాగ్యనగరంలోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లు కేంద్రంగా సాగుతున్న కళ్లు చెదిరే పన్ను ఎగవేత భాగోతాన్ని ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు బట్టబయలు చేశారు. కేవలం హైదరాబాద్లోని కొన్ని హోటళ్లలో మొదలైన సాధారణ తనిఖీలు, ఏకంగా దేశవ్యాప్త పన్ను కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. అత్యాధునిక సాంకేతికతను వాడుకుని సుమారు రూ. 70,000 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ భారీ స్కామ్ను ఛేదించడానికి ఐటీ అధికారులు మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , బిగ్ డేటా అనలిటిక్స్ను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన 60 టెరాబైట్ల (TB) డేటాను అధికారులు విశ్లేషించారు. ఇందులో సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీల లావాదేవీలను ఏఐ సాధనాల ద్వారా స్కాన్ చేయగా, గడచిన ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20 నుండి 2025-26 వరకు) జరిగిన భారీ అవకతవకలు బయటపడ్డాయి. కస్టమర్లు చెల్లించిన బిల్లులను సాఫ్ట్వేర్ నుండి నేరుగా ‘డిలీట్’ చేయడం లేదా మార్చడం ద్వారా హోటల్ నిర్వాహకులు ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నట్లు వెల్లడైంది.
Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోని హోటళ్లు ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 5,141 కోట్ల విలువైన అమ్మకాలను లెక్కల్లో చూపకుండా దాచిపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్లోని పిస్తా హౌస్, షాగౌస్, మెహఫిల్ వంటి ప్రముఖ బిర్యానీ చైన్ల వద్ద జరిగిన తనిఖీల్లో కీలక ఆధారాలు లభించాయి. ఒక్క తెలంగాణలోనే సుమారు రూ. 1,500 కోట్ల విలువైన బిల్లులను సిస్టమ్ నుండి తొలగించినట్లు అధికారులు గుర్తించారు. సగటున ఒక హోటల్ తన వాస్తవ అమ్మకాలను 27% వరకు తగ్గించి చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్లు అంచనా.
హోటల్ నిర్వాహకులు ప్రధానంగా నగదు (Cash) రూపంలో జరిగే లావాదేవీలను లక్ష్యంగా చేసుకున్నారు. కస్టమర్ల నుండి నగదు తీసుకుని బిల్లు ఇచ్చిన తర్వాత, ఆ రికార్డులను సాఫ్ట్వేర్ నుండి పూర్తిగా తొలగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి, నెలల తరబడి జరిగిన అమ్మకాల రికార్డులను కూడా ‘బల్క్ డిలీట్’ ఆప్షన్ ద్వారా మాయం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రూ. 2,784 బిల్లును కేవలం రూ. 27గా మార్చిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా దేశవ్యాప్తంగా సుమారు రూ. 13,317 కోట్ల విలువైన బిల్లులను నేరుగా డిలీట్ చేయగా, మొత్తం మీద లెక్కల్లో చూపని టర్నోవర్ రూ. 70,000 కోట్లకు చేరుకుంది.
కర్ణాటక ఈ పన్ను ఎగవేతలో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విచారణను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దేశవ్యాప్తం చేసింది. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతూ సాగుతున్న ఈ ‘బిర్యానీ స్కాం’పై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.