కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు.
నిమ్స్లో 155 ICU బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 200 ICU బెడ్స్ వచ్చే నెల రోజుల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. 89 వెంటి లేటర్లు అందుబాటులో ఉన్నాయి… 120 కొత్త వెంటిలేటర్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయా శాఖల హెచ్ఓడీలను ఆయన కోరారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.