Site icon NTV Telugu

Harish Rao : రాష్ట్రంలో నిర్బంధ పాలన, పోలీస్ రాజ్యం నడుస్తోంది

Harish Rao

Harish Rao

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, పూర్తిగా నిర్బంధ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతులను ఓదార్చడానికి, వారికి భరోసా కల్పించడానికి వెళ్తుంటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రైతులను కలవకుండా అడ్డుకోవడం గొంతు నొక్కే ప్రయత్నమని, ఇది రాష్ట్రంలో ఒక ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోందనడానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.

Krithi Shetty: నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు..ప్రస్తుతం సింగిల్‌నే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను హరీష్ రావు ‘గడీల పాలన, బేడీల పాలన’గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక నిర్బంధ వాతావరణం నెలకొందని, విమర్శించే వారిని అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన ‘గుడ్డి పాలన’ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రెండు, మూడు పంటలు పండే పచ్చని సాగు భూములను ఫ్యాక్టరీల కోసం లాక్కోవడానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో సాగుకు పనికిరాని భూములు చాలా ఉన్నాయని, అభివృద్ధి పేరుతో పంట భూములను నాశనం చేయవద్దని సూచించారు.

DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసింది..

బాధిత రైతుల్లో మెజారిటీ ఎస్సీ, బీసీ , పేద వర్గాలకు చెందిన వారని, వారి ఏకైక జీవనాధారమైన భూములను లాక్కోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అరెస్టులు చేసినా రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడుతామని హరీష్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Exit mobile version