తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత బడ్జెట్ ప్రసంగంలో ప్యూరిటీ (Purity), క్లారిటీ (Clarity), షూరిటీ (Surety) ఏమీ లేవని, ఇది కేవలం అంకెల గారడీ అని ఆయన విమర్శించారు. రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం ఏ రకంగా వంచిస్తోందో హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు.
మేనిఫెస్టోలో ప్రతి ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని హరీష్ రావు మండిపడ్డారు. గత వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైతులకు రావాల్సిన దాదాపు రూ. 19,000 కోట్ల రైతు బంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. “కుడి చేత్తో రైతు బంధు నిధులను లాగేసుకొని, ఎడమ చేత్తో రుణమాఫీ చేశామని చెప్పడం రైతులను మోసం చేయడమే” అని ఆయన విమర్శించారు. కేసీఆర్ ది ‘పెట్టుబడి సాయం’ పథకమైతే, కాంగ్రెస్ ది ‘ఎన్నికల పెట్టుబడి సాయం’ (Election Investment Support) అని ఎద్దేవా చేశారు.
వరి ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, దానిని కేవలం సన్న రకాలకే పరిమితం చేశారని, అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు. అలాగే, ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా’ పథకం కింద రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని బడ్జెట్లో రూ. 1,300 కోట్లు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక్క రైతుకు కూడా బీమా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో గొప్పగా ప్రకటించి, రెండు బడ్జెట్లు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని హరీష్ రావు విమర్శించారు. “ఇందిరా గాంధీ పేరు పెట్టుకొని నిరుపేద కూలీల కడుపు కొట్టడం ధర్మమేనా?” అని ఆయన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, తాజా బడ్జెట్లో ‘జాబ్ క్యాలెండర్’ ప్రస్తావనే లేకపోవడం దారుణమని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న అశోక్ నగర్ అభ్యర్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కవితను పేరడీ చేస్తూ.. “రాహుల్ గాంధీ మాటలు నమ్మి.. కాంగ్రెస్ కు ఓటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం.. ఎంత కష్టం..” అంటూ నిరుద్యోగుల దీన స్థితిని సభలో వినిపించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అంకెల గారడీ మానుకొని, రైతులకు బకాయి పడ్డ నిధులను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య