ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా సిద్దిపేటకు వచ్చి, అక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కళ్లారా చూడాలని ఆయన సవాల్ విసిరారు. “రంగనాయక సాగర్లోకి వస్తున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.
సిద్దిపేట పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు నీటి ద్వారా మాత్రమే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి సాధించామని హరీష్ రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “వాస్తవాలను పక్కనపెట్టి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆయనను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి” అంటూ హరీష్ రావు ఘాటైన సెటైర్లు వేశారు.

