Harish Rao : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార పక్షం ఎన్ని అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని ఆయన మండిపడ్డారు. దాదాపు 700కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దమని ఆయన అభివర్ణించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, డబ్బు రాజకీయాలకు భయపడకుండా కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచి సత్తా చాటారని, బీఆర్ఎస్ నాయకులకు హరీష్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా ప్రజా తీర్పును మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికుల కృషి వెలకట్టలేనిదని ఆయన ప్రశంసించారు.
Liquor Smuggling Racket: గోవా మద్యం దందాపై ఎక్సైజ్ దాడులు.. 92 బాటిళ్లు, 3 కార్లు సీజ్.!
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అభివృద్ధి పూర్తిగా మందగించిందని హరీష్ రావు విమర్శించారు. “ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయి.. సంక్షేమ పథకాలు అటకెక్కాయి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రేవంత్ సర్కార్ కాలం గడుపుతోంది” అని ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు ఓటు అనే కొరడాతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పారని, మొన్నటి పంచాయతీ ఫలితాలు, నేటి మున్సిపల్ ఫలితాలే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షం దౌర్జన్యాలను ఎదుర్కొని సాధించిన ఈ విజయాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసే వరకు నిర్విరామ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.