ప్రపంచానికే వేదాన్ని అందించిన భారత దేశానికి, వృక్షవేదం అందించిన ఘనత తెలంగాణకే దక్కింది. అలలు అలలుగా సాగే వేద మంత్రోచ్ఛారణల ఘోష మానవ మస్తిష్కంలోని అజ్జానపు తమస్సును పారదోలి జ్జాన ఉషస్సులను ఏవిధంగానైతే ప్రసరింపచేస్తుందో… ముఖ్యమంత్రి కెసిఆర్ గారి హరితహారం స్పూర్తితో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశానికి పరిచయం చేస్తున్న హరిత వేదం…అదే మాదిరి ఆకు పచ్చని ఉషస్సులను పంచుతున్నది. ప్రకృతి పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా పచ్చదనాన్ని విధ్వంసం చేస్తూ తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నడు మనిషి.
తన ప్రాణాలను నిలబెట్టే చెట్టు ప్రాణాలను నిలువెత్తునా తీస్తున్నడు. లేని ధన సంపదకోసం ఆగమైతూ గాలిలో మేడలు కడుతూ పచ్చదన సంపదను కూడబెట్టుకునే సోయి మరిచితిరుగుతున్నడు. కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణవాయుకోసం తన్లాడుతూ తన ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నడు వర్తమాన ప్రపంచ మానవుడు. ఈ నేపథ్యంలో… మనకు ప్రాణం పోసిన దేవుడెంతో, ప్రాణాలను నిలిపే డాక్టరు కూడా భూమ్మీది మనిషి పాలిటి దేవుడే..ననే సంగతిని.. వైద్యో నారాయణో హరి అన్న సూక్తిద్వారా శాస్త్రం చెబుతున్నది. ఈ నేపథ్యంలో తాము ప్రజారోగ్య పరిరక్షణలోనే కాకుండ మానవ మనుగడకు అమూలమైన పచ్చదనం పర్యావరణ పరిరక్షణలోనూ తమ వంతు పాత్ర పోషిస్తామని డాక్టర్లు ముందుకు వచ్చారు. కాలుష్యాన్ని పారద్రోలి, పచ్చదనాన్ని పెంచి, మానవాళికి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించేందుకు రాజ్యసభ సభ్యుడు ఎంపి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో డాక్టర్ల డే సందర్భంగా తామూ పాల్గొన్నారు.
‘నేషనల్ డాక్టర్స్ డే’ ను పురస్కరించుకొని పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య నిపుణులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. 1 జూలై , 2021న గురువారం ఉదయం 7 గంటలకు ఫిల్మ్ నగర్ లోని సాయిబాబా దేవాలయం దగ్గరలోని చిల్డ్రన్ పార్క్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరక్టర్ జి. శ్రీనివాస రావు, సీఎం ఓస్డీ గంగాధర్, గాంధీ హాస్పటల్ సూపరిండెంట్ రాజారావు, నిమ్స్ హాస్పటల్ డైరక్టర్ మనోహర్, అలిమేలు (నీలోఫర్ హాస్పటల్), పద్మజా (నిమ్స్ హాస్పటల్), ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎఎన్ యు హాస్పటల్స్, అపోలో, కాంటినెంటల్, కిమ్స్, మెడికవర్, రెయిన్ బో, సన్ షైన్, విరించి, యశోదా దవాఖానలకు చెందిన పలువురు వైద్య నిపుణులు పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సంధర్భంగా…..గ్రీన్ ఛాలెంజ్ ఫౌండర్ అండ్ మెంటర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్స్ డే రోజు 60 మంది ప్రముఖ వైద్యులు ఒకే వేదిక వద్దకు వచ్చి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎందరికో ఇది స్ఫూర్తి దయకమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం విధిగా భావించాలని, భావి భారత పౌరులకు గ్రీన్ ఇండియాను అందించడం మన బాధ్యత అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ విలువ మనం తెల్సుకున్నాము. ప్రకృతిని మనం కాపాడుకోవడం ఎంతో అవసరం అని చెప్పారు.