Genco CMD Prabhakar Rao comments on Central Electricity Amendment Bill: కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టాలు వస్తాయని అన్నారు జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు. ఇప్పటికే ఈ విద్యుత్ సవరణ బిల్లును సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని.. బిల్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేశారని అన్నారు. ఈ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని అన్నారు. త్వరలో విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు అందిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రావు. ఇప్పటికే పీఆర్సీ కమిటీ వేశామని.. కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. జల విద్యుత్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లాయని వెల్లడించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎక్కువగా నష్టం జరిగిందని.. ఉద్యోగులు, సిబ్బంది కష్టపడి విద్యుత్ పునరుద్ధరించారని అన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ సంస్థల్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు.
Read Also: Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ‘చేతి’కి తెలంగాణ బాధ్యతలు.. ఠాగూర్ ఔట్..!
కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్ సవరణ బిల్లును తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాలను నిర్వీర్యం చేసే కుట్రగా సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విద్యుత్ సవరణ బిల్లు వల్ల వినియోగదారులకే విపరీత భారం పడుతుందని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. ఇప్పుడున్న లైన్ నుంచే కరెంట్ సరఫరా చేస్తూ ప్రైవేట్ కంపెనీలు పైసా ఖర్చు లేకుండా లాభాలు సంపాదించుకుంటాయని విమర్శిస్తున్నారు. గత సోమవారం ఈ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ విద్యుత్ సంఘాలు ఒకరోజు నిరసనగా విధులను బహిష్కరించారు. కేంద్రం ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటుందని ఆరోపిస్తున్నారు. కేంద్రం కనుక ఈ చట్టాన్ని తీసుకువస్తే విధులను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించారు.