సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతం భారీ అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక గోదాంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు పెను ప్రమాదానికి దారితీశాయి. గత రెండున్నర గంటలుగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ, పరిస్థితి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు.
Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!
ప్రాథమిక సమాచారం ప్రకారం, గోదాంలో నిల్వ ఉంచిన సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. డ్రమ్ముల్లో ముడిసరుకు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించి, దట్టమైన నల్లటి పొగ ఆకాశమంతటా కమ్మేసింది. ఈ అగ్నికీలల తీవ్రత కారణంగా సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే, కెమికల్ సాల్వెంట్స్ ఉండటం వల్ల మంటలు తగ్గకపోగా మరింతగా ఎగసిపడుతున్నాయి. దీనికి తోడు దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ భారీ అగ్నిప్రమాదంలో గోదాంలోని ముడిసరుకు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. అయితే, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు మరిన్ని ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు.