ఇబ్రహీం పట్నంలో సంచలనం కలిగించిన కాల్పుల ఘటనలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో రెండు లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి ఎక్కడి నుంచి తెచ్చారనేది ఆరాతీస్తున్నారు. కారులో రెండు క్యాట్రిడ్జీలను స్వాధీనం చేసుకుంది క్లూస్ టీమ్.
శ్రీనివాస్ రెడ్డిని షాట్ వెపన్ తో, రాఘవేంద్ర రెడ్డి పై తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. రాఘవేందర్ రెడ్డి మృతదేహం నుండి బుల్లెట్ ను తీసి పోలీసులకు అందజేశారు వైద్యులు. శ్రీనివాస్ రెడ్డి తల నుండి దూసుకెళ్లింది బుల్లెట్. శ్రీనివాస్ రెడ్డిని పాయింట్ బ్లాక్లో కాల్చి చంపారు దుండగులు. మట్టా రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న కృష్ణ, హఫీజ్ లతో పాటు పలువురిని విచారిస్తున్నారు పోలీసులు. మట్టా రెడ్డి పైనే అనుమానం వ్యక్తం చేశారు డ్రైవర్ కృష్ణ, హఫీజ్ లు. రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్పుల్లో మరణించిన వారి సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తుంది దర్యాప్తు టీమ్. అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేటను ముమ్మరం చేశారు.