కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల పొగతో ఆసుపత్రి ప్రాంతం కమ్ముకుపోయింది. ఈఘటనపై సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగి కుటుంబీకులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు ఈ ఘటనతో భయాందోళనలో ఉన్నారు.
ఇప్పటి వరకు 35 మంది రోగులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్షేమంగా బయటకు తరలించారు. చికిత్స పొందుతున్న రోగులను వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఇతర ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రి సెల్లార్ లో ఉన్న పేషెంట్ల విషయమై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సహాయక చర్యలు మరియు ఘటన పై ఆరా తీయడం జరిగింది. అగ్నిప్రమాదం కు గల కారణాలు తెలియాల్సి ఉంది.