Nizamabad: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుట అరవింద్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాజాగా 13 మండలాల బీజేపీ అధ్యక్షులను మారుస్తూ అరవింద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు నియోజకవర్గాల కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎంపీ తీరుపై సొంత పార్టీ కార్యకర్తలే నిరసన వ్యక్తం చేయడం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read also: RS Praveen Kumar: అసైన్డ్ భూములలో ఎవరి ఫామ్ హౌస్ లు ఉన్నాయో బయట పెట్టాలి..!
ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న నేతలను విస్మరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. విశ్వాసపాత్రులైన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నిజామాబాద్లో బీజేపీని కాపాడండి, జై అరవింద్కే పదవులు..? జై బీజేపీ, వేటు.. భారత్ మాతాకీ జై.. భారతీయ జనతా పార్టీ జిందాబాద్.. మాకు న్యాయం కావాలి.. ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ అరవింద్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత అరవింద్ కు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుంది? అనేది వేచి చూడాలి.
Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ స్పీడు.. పూరీ, రామ్లు చుట్టేస్తున్నారుగా!