AICC National Spokesperson Dasoju Sravan Kumar about 111 G.O.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు సభలో కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తాం అని ప్రకటించారు. దీనిపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. 111 జీవోను ఎత్తివేస్తా అంటూ ఒక కీలక ప్రకటన చేశారు సీఎం.. సుప్రీంకోర్టు లో కేసు ఉండగా కేసీఆర్ ఎలా జీవోను ఎత్తేస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఇది రియల్ ఎస్టేట్ బూమ్ ను సృష్టించడానికి చేసిన ఎత్తుగడ అని, 111 జీవో పరిధిలో 1 లక్ష 30 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో లక్ష ఎకరాల భూమి టీఆర్ఎస్ నాయకులు కొనుగోలు చేశారని, వాళ్ళ కోసమే ఈ 111 జీవో ఎత్తివేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.
25 కోట్ల రూపాయలకు ఒక విల్లా అమ్ముతున్నారని ఇది అభివృద్ధి అంటున్నారు. ఇది సన్నాసి ఆలోచన.. అంటూ ఆయన దుయ్యబట్టారు. ఇదా తెలంగాణ అభివృద్ధి.. పేద వాడు ఇల్లు, ప్లాట్ కొన్నప్పుడే అభివృద్ధి.. అని ఆయన వ్యాఖ్యానించారు. 111 జీవో పై బహిరంగ చర్చకు సిద్ధమా.. అని ఆయన సవాల్ విసిరారు. గండిపేట, హిమాయత్ సాగర్ నీళ్లు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారని, ఆ చెరువులను పూడ్చి రియల్ ఎస్టేట్ కు అప్పగించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు.