మరోసారి తెలంగాణను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతోంది… హైదరాబాద్లో వ్యాక్సిన్ల కోసం ప్రజలు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రెండో డోసు అయినా.. మొదటి డోసు అయినా ఏం తేడా లేదు.. తెల్లవారుజామునే వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు… అయితే, ఒక్కో పీహెచ్సీలో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసుతున్నారు సిబ్బంది.. దీంతో.. మిగతావారు వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు లక్ష మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఈ మూడు జిల్లాల పరిధిలో 484 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నా.. వ్యాక్సిన్ల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది.. ఇక, నేటి నుంచి మరో 72 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలు కూడా అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు అధికారులు.
తెలంగాణను ఆది నుంచి వ్యాక్సిన్ల కొరత ఉంది… వ్యాక్సిన్ల వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధమే నడిచింది.. వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా రోజులు వ్యాక్సిన్ సెంటర్లను కూడా మూసివేసిన సందర్భాలు ఉన్నాయి.. మరోవైపు వ్యాక్సిన్లు ఎక్కువ సంఖ్యలో వృథా చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. ఆ తర్వాత కాస్త పరిస్థితి మారిపోయింది.. విస్తృతంగా వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.. కొత్తగా తాత్కాలిక వ్యాక్సినేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి.. వ్యాక్సిన్ వేశారు.. కానీ, ఇప్పుడు మళ్లీ టీకాల కొరత ఏర్పడింది.