తెలంగాణ పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కరోనా బారిన పడుతుండటం బాధాకరమని చెప్పాలి. కరోనా థర్డ్ వేవ్లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు.
Read Also: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా
మరోవైపు హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సేవలు అందిస్తున్న పలువురు పోలీసులకు వరుసగా కరోనా వస్తుండటం అధికారులను కలవరపెట్టిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విధులు నిర్వహించాలంటే పోలీస్ సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్కు ఒక్క ఫిర్యాదుదారుడు మాత్రమే రావాలని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే పోలీస్ శాఖలో 90 శాతం మంది సిబ్బంది కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు బూస్టర్ డోస్ సైతం వేగంగా ఇవ్వాలని అధికారులకు అదేశాలు జారీ అయ్యాయి. హోమ్ గార్డ్ క్యాడర్ నుంచి ఐపీఎస్ క్యాడర్ వరకు అందరూ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.