ఇవాళ హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కాంగ్రెస్ నేతలు వీహెచ్, భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు కరోనా నుంచి సోనియా గాంధీ కోలుకోవాలని పూజలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు హిందువులందరికీ దేవత అన్న కాంగ్రస్ నేతలు.. బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు.
బండి సంజయ్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్లో గల భాగ్యలక్ష్మి అమ్మ వారి గుడిపై ఎవరూ చెయ్యి వేయరని అన్నారు. అమ్మవారిని తాము కూడా కొలుస్తామని చెప్పారు. చార్మినార్ వద్ద ముస్లింలు నమాజ్ చేస్తారని, అదే ప్రాంతంలో హిందువులు భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కుతారని కాంగ్రెస్ నేతలు వీహెచ్ అన్నారు.
చార్మినార్ వద్ద ముస్లింల ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ స్థానిక నేత రషీద్ ఖాన్ సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారని వార్తలు వచ్చాయి. ఆయన ఎవరో మాకు తెలీదు అన్నారు. ఈ అంశంపై పార్టీలో చర్చించి తెలుసుకుంటామని వివరించారు. తమ పార్టీ వాళ్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని వీహెచ్ అన్నారు. ఇలాంటివీ సాధారణంగా ఎంఐఎం చేస్తుందని, ఈ కుట్ర వెనక వారి హస్తం ఉందేమోనని అనుమానంగా ఉందన్నారు. బీజేపీ, ఎంఐఎం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఎవరయిన తమ పరిధిలో హుందగా ప్రవర్తించాలని కోరారు. కానీ రెచ్చగొట్టేలా కామెంట్ చేయడం సరికాదని సూచించారు. నేతలు మిగతావారికి ఆదర్శంగా నిలవాలే తప్ప.. ప్రశ్నించే మాదిరిగా ఉండొద్దని కోరారు.
కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. కాంగ్రెస్కు దమ్ముంటే భాగలక్ష్మి ఆలయంపై చేయి వేయాలంటూ సవాల్ విసిరారు బండిసంజయ్, ‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండిసంజయ్.