Manikrao Thakre: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోనుందని తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. వామపక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి ఫలిస్తాయన్నారు. సీఎల్పీ నేత మల్లుభట్టి మంతనాలు సాగిస్తున్నారని అన్నారు. వామపక్షాలతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలతో చర్చల బాధ్యతను మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామన్నారు. వామపక్షాలతో కలిసి వెళ్లాలన్నదే తమ అభిమతమని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. వామపక్షాలకు ప్రత్యామ్నాయ స్థానాలు ప్రతిపాదించాలని సూచించినట్లు తెలిపారు. తెలంగాణలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలో ఖరారు చేయనున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులను ఖండించారు. తెలంగాణలో బీఆర్ఎస్ వెనుక బీజేపీ, ఎంఐఎం ఉన్నాయని మాణిక్రావు ఠాక్రే ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్కు ఉందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే బీజేపీ ఐటీ దాడులు చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డను సందర్శించకుండా అడ్డుకోవడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో రహస్యం ఏంటి? ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను ప్రజలు ఎందుకు చూడకూడదన్నారు.
రాష్ట్రానికి కాళేశ్వరం పుణ్యక్షేత్రంగా మారిందని విమర్శించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 60ఏండ్లలో నిర్మించినా నేటికీ చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. వరదలు, వర్షాలు లేకున్నా మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి ఏమీ కాలేదని కేసీఆర్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ సగం డబ్బులు చెల్లించడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ శాఖలు దాడులు చేస్తున్నాయన్నారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించే పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే కేంద్రంలో ఐటీ దాడులు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏది చెప్పినా బీజేపీ అమలు చేస్తోందన్నారు. వ్యవస్థల వల్ల ప్రజలపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి వారు ఎన్నికల సమయంలో సంయమనం పాటించాలి. ప్రతిపక్షాలపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనన్నారు. ఐటీ దాడులపై కాంగ్రెస్ పార్టీ చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మరోవైపు సీపీఐ, సీపీఎంలకు రెండు వందల సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐకి, మిర్యాలగూడతో పాటు మరో అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు కేటాయించాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు. కాంగ్రెస్లో ఇతర పార్టీల చేరికలు వామపక్షాలకు కేటాయించే సీట్లపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఈ తరుణంలో వామపక్షాల నేతలు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి సీపీఎం రాష్ట్ర నాయకత్వం ఇవాళ మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే..
Mahbubnagar: వీరు మామూలోళ్లు కాదురా బాబు.. పోలీసునే హానీ ట్రాప్ లో పడేసిన కానిస్టేబుల్